Advertisement

వెన్నెల కిషోర్ టైమింగ్ సూపర్: దాసరి

Wed 24th Feb 2016 06:27 PM
eluka majaka movie,release date,relangi narasimha rao,vennela kishore  వెన్నెల కిషోర్ టైమింగ్ సూపర్: దాసరి
వెన్నెల కిషోర్ టైమింగ్ సూపర్: దాసరి
Advertisement

డా|| బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, పావని ప్రధాన పాత్రల్లో నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ఎలుకా మజాకా'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కారక్రమంలో..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''రేలంగి నరసింహారావు సినిమా అంటే నా సినిమా కిందే లెక్క. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. స్టార్ హీరోలు ఉన్న సినిమాలే తప్ప మరే సినిమాను కొనడానికి బయ్యర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గాని ముందుకు రావట్లేదు. చాలా మంది సినిమా తీసిన తరువాత రిలీజ్ చేసే దిక్కు లేకపోవడం వలన 250 సినిమాలు మూలన పడి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉండడం వలన ఈ సినిమాను చిత్ర నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. 'ఎలుకా మజాకా' రేలంగి ట్రేడ్ మార్క్ సినిమా అవుతుంది. ఇప్పటివరకు రేలంగి ఆప్టికల్ వర్క్ తో చాలా సినిమాలు చేశాడు కాని గ్రాఫిక్స్ వర్క్ల్ తో సినిమా చేయడం తొలిసారి. కోడిరామకృష్ణ గ్రాఫిక్స్ లో నిష్ణాతుడు. అతను డైరెక్ట్ చేసిన 'అమ్మోరు' లాంటి గ్రాఫిక్స్ సినిమాను మరెవరు చేయలేరు. ఎలుక తో నటింపజేయడం కష్టం. అందుకే ఈ సినిమాలో 40 నిమిషాల గ్రాఫిక్స్ వర్క్ చేశారు. ఈ సినిమాకు గ్రాఫిక్స్ చేసిన సత్య ఏరోజుకైనా.. ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ సినిమా ఓ గమ్మత్తైన కథ. మంచి పాయింట్ తో తీశాడు. విఘ్నేశ్వరుడ్ని కేర్ చేయని హీరో మీద విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుక ఎలా తనను ఇబ్బందులకు గురి చేసిందో అనేదే ఈ సినిమా కథ. 'నమ్మిన బంటు' సినిమాకు ఎద్దు హీరో అయితే, 'నాగిని' సినిమాకు పాము హీరో అయితే, 'ఈగ' సినిమాకు ఈగ హీరో అయితే, 'ఎలుకా మజాకా' సినిమాకు ఎలుకే హీరో. ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్స్ రావడం కష్టమైపోతుంది. ఈ వారంలో 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ కూడా దొరకని పరిస్థితి. అలాంటి స్థితిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరు బాగా ప్రమోట్ చేస్తారో.. ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. ఈ విషయమై నేను ప్రభుత్వంతో చర్చలు జరిపాను. 4 ఆటలు ఉంటున్న సినిమాను 5 ఆటలు వేయమని చెప్పాను. ఒంటి గంట షో మాత్రం చిన్న సినిమాకు కేటాయించాలని చెప్పాను. దానికి టాక్స్ మినహాయించి, షో మ్యాండేటరీ చేయమన్నాను. త్వరలోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడుతుందనుకుంటున్నాను. ఇది పిల్లలతో చూడాల్సిన సినిమా. సినిమా మొదటి షో కి పిల్లలతో వచ్చిన తల్లి తండ్రులకు ఉచితంగా సినిమా చూపించమని నిర్మాతలకు చెప్పాను. పబ్లిసిటీ పరంగా కూడా బాగా క్లిక్ అవుతుంది. ఇలాంటి సినిమాకు ఓపెనింగ్ వస్తే ఖచ్చితంగా సినిమా నిలబడుతుంది. మొదటి వారం సినిమా ఆడితే సక్సెస్ కిందే లెక్క. వెన్నెల కిషోర్ మంచి టైమింగ్ ఉన్న నటుడు. తను గొప్ప స్థాయికి ఎదుగుతాడు. బ్రహ్మానందం, రఘుబాబు, పావని ఇలా ప్రతి ఒక్కరు సినిమాలో బాగా నటించారు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

కోడిరామకృష్ణ మాట్లాడుతూ.. ''నాకు పరిచయమైన ప్రాజెక్ట్ ఇది. రేలంగి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాడు. తన కామెడీ సినిమాలతో అందరిని హాయిగా నవ్విస్తాడు. ఎలుకే ఈ సినిమాలో హీరో. నిర్మాతలు సినిమాకు చాలా ముఖ్యం. ఈ చిత్ర నిర్మాతలు సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఈరోజు వరకు నవ్వుతూనే ఉన్నారు. ఇలాంటి నిర్మాతలు ఉంటేనే చలన చిత్ర పరిశ్రమ నిలబడుతుంది'' అని చెప్పారు.

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. నా కెరీర్ లో మొదటిసారి గ్రాఫిక్స్ తో సినిమా తీశాను. ఇంతకముందు గ్రాఫిక్స్ కు అవకాసం ఉన్న సినిమాలు తీశాను కాని ఆ టైంలో గ్రాఫిక్స్ కు అంతగా ప్రాముఖ్యత లేదు. గ్రాఫిక్స్ సులువే అనుకొని సినిమా మొదలుపెట్టాను కాని అదే కష్టమైంది. 2015 ఫిబ్రవరి 6న సినిమా మొదలుపెడితే 2016 ఫిబ్రవరి 26 నాటికి రిలీజ్ చేస్తున్నాం. గ్రాఫిక్స్ వలనే సినిమా లేట్ అయింది. సినిమాలో 40 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటుంది. ఎలుక పాత్రలో బ్రహ్మానందం అధ్బుతంగా నటించారు. వెన్నెల కిషోర్ ఎలుకతో చాలా ఇబ్బందులు పడ్డాడు. జంధ్యాల గారి సినిమాల్లో నా సినిమాల్లో ఒక మ్యానరిజం ఉంటుంది. ఈ సినిమాలో ఆ మ్యానరిజం ఉన్న క్యారెక్టర్ రఘుబాబు నటించారు. తెలుగమ్మాయి కోసం వెతికే ప్రయత్నంలో పావని దొరికింది. చాలా చక్కగా నటించింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు. సినిమా ఇంత క్వాలిటీగా ప్రతి టెక్నీషియన్ ఎంతగానో సహకరించారు'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. దాసరి నారాయణరావు గారు, ధవళ సత్యం గారు, కోడిరామకృష్ణ గారు ఇచ్చిన సలహాలే ఈ సినిమాకు మూల స్థంబాలు. ఈ సినిమాలో మొత్తం 1222 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటు అంతర్లీనంగా సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వెన్నెల కిషోర్, పావని తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మూలకథ: మురళీ మోహనరావు, స్క్రీన్ ప్లే: దివాకర్ బాబు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: నాగేంద్ర కుమార్, ఎడిటర్: నందమూరి హరి, మ్యూజిక్: బల్లేపల్లి మోహన్, గ్రాఫిక్స్: సగిలి సత్యనారాయణరెడ్డి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement